Friday, 31 May 2019

దుస్తులు మార్చుకునే గదిలో రహస్య కెమెరా,విందుకు ఆహ్వానించి..నగ్న చిత్రాలు తీసి..

హైదరాబాద్‌: బలవంతంగా లొంగ దీసుకునేందుకు.. తాము చెప్పినట్లు నడుచుకోవాలన్న కక్షతో ఇద్దరు సైబర్‌ నేరస్థులు ఒక యువతి నగ్నచిత్రాలు, వీడియోలను ఆమెకు తెలియకుండా తీశారు.. ఆమె ఒక యువకుడితో కలిసి ఉన్నట్టు ఆ ఫొటోలను మార్ఫింగ్‌ చేశారు. వీటిని ఆమెకు, ఆమె సోదరుడి చరవాణికి పంపించారు. మరిన్ని చిత్రాలు పంపుతామంటూ ఆమె సోదరుడిని హెచ్చరించారు. నగ్నచిత్రాలు చూసి ఆందోళన చెందిన బాధితురాలు తనకే పాపం తెలీదంటూ సోదరుడికి చెప్పగా వెంటనే బాధితురాలి సోదరుడు ఆమెతో కలిసి బుధవారం రాత్రి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాతబస్తీలో ఐదురోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీస్‌ అధికారులు ప్రాథమిక వివరాలు సేకరించారు. ఇద్దరు యువకులను గుర్తించారు. వీరు ఫోన్లు స్విచ్చాఫ్‌ చేయడంతో గాలింపు చర్యలు   చేపట్టారు.

భర్తతో విభేదాలు.. ఆకర్షించేందుకు యత్నాలు..

పాతబస్తీలో ఒక యువతి భర్తతో విభేదాల కారణంగా కొద్దినెలలుగా తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు ఆమెను ఎలాగైనా ఆకర్షించి లొంగ దీసుకోవాలని పథకం వేశారు. రెండు, మూడునెలల నుంచి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె విముఖత ప్రదర్శించింది. దీంతో ఆమెకు దగ్గరయ్యేందుకు ఇతర మార్గాలపై దృష్టి సారించారు. యువతి ఇంటిపక్కనే ఉంటున్న ఓ మహిళ ద్వారా వల వేయాలని నిర్ణయించారు. సదరు మహిళతో ఒక యువకుడికి బంధుత్వం ఉండటంతో ఆమె ఇంటికి తరచూ వెళ్లేవారు. అలా ఆ మహిళతోపాటు బాధితురాలి ఇంటికి వెళ్లేవారు. ఒక్కోసారి ఆ మహిళ బాధితురాలిని తన ఇంటికి తీసుకువచ్చేది. నిందితులిద్దరినీ చూడగానే ఆమె వెళ్లిపోయేది. ఇక లాభం లేదననుకున్న యువకులు పదిరోజుల క్రితం తమ పథకాన్ని అమలు చేయాలని గట్టిగా అనుకున్నారు. బాధితురాలి పక్కింటివారు విందు ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకున్నారు. వెంటనే కార్యచరణ ఆరంభించారు. విందుకు తప్పనిసరిగా యువతిని పిలిపించాలంటూ మహిళను అభ్యర్థించారు.

పండ్ల రసం దుస్తులపై ఒంపి..

తమ ఇంట్లో విందుకు రావాలంటూ మహిళ ఐదురోజుల క్రితం యువతిని ఆహ్వానించింది. బాధితురాలి వెన్నంటే ఉన్న ఇద్దరు యువకులు అందరి భోజనం పూర్తయ్యాక ఉద్దేశపూర్వకంగా ఆమె దుస్తులపై పండ్లరసం ఒలికేలా చేశారు. శుభ్రం చేసుకోండి అంటూ మహిళతో బాధితురాలిని దుస్తులు మార్చుకునే గదిలోకి వెళ్లేలా చేశారు. గదిలో ఎవరూ లేకపోవడంతో పండ్ల రసాన్ని శుభ్రం చేసుకునేందుకు ఆమె దుస్తులు విప్పేసి నీళ్లతో శుభ్రం చేసుకుని బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయింది. మంగళవారం సాయంత్రం ఆమె సోదరుడి చరవాణికి, ఆమె చరవాణికి ఫొటోలు వచ్చాయి. వాటిని చూసిన వెంటనే ఆమె అవాక్కయింది. సోదరుడి ఓదార్పుతో తేరుకున్న ఆమె బుధవారం రాత్రి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు విషయాన్ని వివరించారు. బాధితురాలు గదిలోకి వెళ్లక ముందే నిందితులు ఒకటి, రెండు చరవాణులను రహస్య ప్రాంతంలో అమర్చి ఉంటారని పోలీసులు వారిద్దరికీ వివరించారు. వీలైనంత వేగంగా నిందితులను అరెస్ట్‌ చేస్తామంటూ వారికి చెప్పారు.



No comments:

Post a Comment